జనగామ జిల్లా: వ్యతిరేక పవనాలు వీస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించినందుకు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజలకు కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ముఠా తగాదాలు వదిలి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ప్రభుత్వ రాబడికి ఎక్కడ పొంతన కుదరడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ప్రజా తీర్పును గౌరవించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన కొనసాగించాలి. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అనేక రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రమగామిగా నిలిపిన స్థానాన్ని కాపాడాలి.
టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఉద్భవించిన పార్టీ. తెలంగాణ ప్రజల హక్కులకు భంగం వాటిల్లిన టిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల డిఎన్ఏ లోనే పోరాటం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకమత్యంగా ఉండి ప్రజలకు సుపరిపాలన అందించాలి. ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపడం అంటే మామూలు వ్యవహారం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు పరచాలి. ఆర్థిక వనరులను సమీకరించాలి.’’ అని సూచించారు.