స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ సిద్ధమవుతుంది. ఈ మెగాటోర్నీకి ముందు జరిగే ఆసియాకప్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వలోని సెలెక్షన్ కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ లో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వన్డే జట్టుకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో 2-3తో టీ20 సిరీస్ కోల్పోవడానికి పాండ్యా కెప్టెన్సీ కూడా ఒక కారణమని బీసీసీఐ విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది.
దాంతో అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్తో టీ20 సిరీస్ ద్వారా పునరాగమనం చేసిన ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. 2022లోనే టెస్టు జట్టుకు బుమ్రా కెప్టెన్గా వ్యవహరించాడని, పాండ్యా కంటే ముందు బుమ్రా పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ భారత వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడని, ఆసియాకప్తో పాటు ప్రపంచకప్నకు బుమ్రా వైస్ కెప్టెన్గా ఎంపికైతే ఆశ్చర్యపోనవసరం లేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.