హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు సబ్రినా సిద్దిఖీ వేధింపులకు గురయ్యారు. భారత్లో మైనారిటీలపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆమె ప్రధానిని ప్రశ్నించారు. దీంతో ఆమెను పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ముద్ర వేసి వేధింపులకు గురిచేస్తున్నారు.
జర్నలిస్టుపై వేధింపులను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోదీ ప్రదర్శించిన ప్రజాస్వామ్య విలువలకు ఇది విరుద్ధమైన చర్య అని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బి పేర్కొన్నారు. బైడెన్ పాలనలో అమెరికా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉందన్నారు ట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పెర్రీ.
మరోవైపు పత్రికా స్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని వస్తున్న విమర్శలకు ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తున్నదని ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు. సౌత్ ఏషియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఎస్ఏజేఏ) కూడా జర్నలిస్టుపై వేధింపులను తీవ్రంగా ఖండించింది.
ఇదిలా ఉండగా ఆన్లైన్ వేధింపులపై తాజాగా సిద్ధిఖీ స్పందించారు. ‘కొంతమంది నన్ను టార్గెట్ చేస్తున్నారు. నా వ్యక్తిగత అంశాలపై ఆరోపణలకు దిగుతున్నారు. తన గుర్తింపును నిత్యం నిరూపించుకోవాల్సి వస్తున్నది. కొన్నిసార్లు ఇది కఠినంగా ఉంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2011 క్రికెట్ ప్రపంచకప్ సమయంలో భారత జెర్సీని ధరించి తన తండ్రితో పాటు క్రికెట్ చూస్తున్న ఫొటోలను ఆమె ట్విట్టర్లో షేర్ చేశారు.