హైదరాబాద్: ప్రపంచం మెచ్చేలా తెలంగాణను పాలించిన నేత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ప్రశంసలు కురిపించారు.తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచాన్నే అబ్బురపరిచాయని పేర్కొన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని, అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ను ఆదరించడానికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తన పకడ్బందీ వ్యూహాలతో .. సుదీర్ఘకాలం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడంతోపాటు ప్రపంచంలోనే తెలంగాణకు ఇమేజ్ను సృష్టించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సమీక్షించుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.