Saturday, May 18, 2024

డబ్బు కోసం నలుగురిని పెళ్లాడిన 25 ఏండ్ల యువతి

spot_img

త్వరగా ధనవంతురాలిని కావాలనే కోరికతో ఓ యువతి ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకుంది. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన 25 ఏళ్ల స్నేహ రెండేళ్ల కిందట రైల్లో వెళుతున్న సమయంలో పరిచయమైన ప్రశాంత్‌ అనే యువకుడిని వివాహం చేసుకుంది. దంపతులిద్దరూ దావణగెరెలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తాను గర్భందాల్చానని చెప్పి రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్లింది. ఫోన్‌ చేసి రమ్మని అడిగితే అందుకు నిరాకరించింది. ఆమె ఇచ్చిన చిరునామా ప్రకారం పుట్టింటికి వెళ్లి చూడగా.. ఆమె అక్కడ లేదు. దాంతో తన భార్య కనిపించడం లేదని ప్రశాంత్ కేటీజే నగర పోలీస్ స్టేషన్‏లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

స్నేహకు ఇప్పటికే రెండు పెళ్లిల్లు అయ్యాయని, ప్రశాంత్‌ మూడో భర్త అని గుర్తించారు. ఎలాగో అలాగా స్నేహ జాడ తెలుసుకుని వెళ్లేలోగా బెంగళూరుకు చెందిన రఘు అనే యువకుడిని ఆమె నాలుగో వివాహం చేసుకుంది. ఆమెకు పెద్దలు మేలుకోటె నివాసి అయిన మహేశ్‌తో మొదట వివాహం చేశారట. అతన్ని విడిచి పెట్టిన ఆమె బెంగళూరుకు చెందిన వెంకటేశ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అతన్ని వదిలేసి.. దావణగెరెకు చెందిన ప్రశాంత్‌ను, ఇప్పుడు రఘు వెంట నడిచింది. ప్రశాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్నేహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు కోసమే ఒకరి తర్వాత ఒకరిని మోసం చేసి పెళ్లి చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆమె చేతిలో మోసపోయిన పెళ్లి కొడుకులంతా.. లబోదిబోమంటున్నారు.

Read Also: హైదరాబాద్‎లో ఫేక్ మెడిసిన్స్ కలకలం.. ఆందోళనలో వినియోగదారులు

Latest News

More Articles