లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఫాఫ్ డుప్లెసిస్ కొట్టిన షాట్ను బౌండరీ లైన్ దగ్గర ఆపే క్రమంలో రాహుల్ కుడి కాలికి గాయం అయింది. పరిశీలించిన వైద్యులు రాహుల్కు ఆపరేషన్ అవసరమని చెప్పారు. దాంతో ఐపీఎల్ తో పాటు వచ్చే నెలలో లండన్లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు కూడా రాహుల్ దూరమయ్యాడు.
కాగా.. ఐపీఎల్కు దూరమైన రాహుల్ స్థానంలో కర్నాటక బ్యాటర్ కరుణ్ నాయర్ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి తీసుకుంది. అన్ సోల్డ్ ప్లేయర్గా నిలిచిన కరుణ్ నాయర్ను లక్నో రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. కరుణ్ నాయర్ టీమిండియా తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన సంగతి అభిమానులకు గుర్తుండే ఉంటుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్… రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఆయా జట్ల తరఫున మొత్తంగా 76 మ్యాచ్లు ఆడిన నాయర్ 1496 పరుగులు చేశాడు.