Monday, May 13, 2024

యూకే పార్లమెంట్ కమిటీ హాల్‎లో ‘కేసీఆర్ కృతజ్ఞత సభ’

spot_img

హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ స్థాపన చేసినందుకు, తెలంగాణ సచివాలయానికి డా. బీఆర్. అంబేద్కర్ పేరు పెట్టినందుకు, దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నందుకు గానూ.. బ్రిటన్ ఎంపీలు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‎కు కృతజ్జతలు తెలిపారు.

దళితజనోద్ధరణకు కంకణం కట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును బ్రిటన్ సమాజం ఆకాశానికెత్తుతున్నది. వివక్షకు గురవుతూ, విస్మరించబడిన ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వినూత్న పథకాలు దేశంలో ఇప్పటికే విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. దళితబహుజన, సబ్బండ కులాల అభ్యున్నతి కోసం సిఎం కేసీఆర్ కార్యాచరణ దేశం నలుదిక్కులనుంచి ప్రశంసలు అందుకుంటున్నది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యాచరణను ప్రశంసిస్తూ బ్రిటన్ ఎంపీలు లేఖ రాశారు. తాజాగా సోమవారం యూకే పార్లమెంట్ కమిటీ హాల్‎లో సీఎం కేసీఆర్‎కు కృతజ్జతలు తెలుపుతూ సభను నిర్వహిండం చర్చనీయాంశంగా మారింది.

‘అంబెడ్కర్ యూకే సంస్థ’ మరియు ‘ప్రవాస భారతీయ సంస్థ’ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కేసీఆర్ కృతజ్జత సభ ఘనంగా జరిగింది. డా. బిఆర్. అంబెడ్కర్ కీర్తి ప్రపంచానికి చాటి చెప్పేలా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం, తెలంగాణ సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టడం, సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుండడం పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం కేసీఆర్‎ను అభినందిస్తూ సభ జరిగింది. యూకే పార్లమెంట్ కమిటీ హాల్‎లో ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ కృతజ్ఞత సభ’కు యూకే ఎంపీలు వీరేంద్ర శర్మ, నవేదు మిశ్ర, బారోన్ కుల్దీప్ సింగ్ సహోట, ఇంకా పలువురు స్థానిక కౌన్సిలర్లు హాజరయ్యారు. అంతేకాకుండా.. బ్రిటన్‎లో నివసిస్తున్న పలువురు ప్రముఖ ఎన్నారైలతో పాటు, స్థానిక ప్రవాస సంఘాల నాయకులు, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తదితరులు ఈ కృతజ్జతా సభకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బ్రిటన్ ఎంపీలు మాట్లాడుతూ…. అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్ అని, దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు మాత్రమే కాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా దళితుల సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిమంతంగా ఉందని బ్రిటన్ ఎంపీలు కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దళితులు ఆర్థికంగా బలపడడమే కాకుండా సమాజంలో వారికి ఆత్మగౌరవం సముచితంగా లభించడంతో పాటు సామాజిక వివక్ష, అసమానతలు తొలిగిపోతాయని బ్రిటన్ ఎంపీలు తెలిపారు. ఇంతటి గొప్ప కార్యాచరణను అమలు చేస్తున్నతెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని వారు అభినందించారు. సామాజిక, ఆర్థిక వివక్షను రూపుమాపేదిశగా ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతూ… భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని బ్రిటన్ ప్రజా ప్రతినిధులు ప్రసంశించారు.

తెలంగాణ ఎఫ్‎డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ నిర్ణయం చారిత్రాత్మకమని, నేడు కేసీఆర్ పాలన పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రైతు బంధు పథకాన్ని ఐక్య రాజ్య సమితి గుర్తించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో మొదలైన దళిత బంధు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతూ సాధిస్తున్న విజయ గాథలను అనిల్ కూర్మాచలం సభకు వివరించారు.

మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శమైందని అన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ ని గౌరవించుకోడమే కాకుండా నేడు దళితులు అన్ని విధాలా అభివృద్ధి చెందాలని సముచిత స్థానం కలిపించారన్నారు. దళిత బంధు ద్వారా ఎన్నో దళిత కుటుంబాల్లో వెలుగు నింపారని ఆయన తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని నేడు దేశ ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణ మోడల్ నేడు దేశానికి రోల్ మాడల్ అయ్యిందని కర్నె ప్రభాకర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రవాస సంస్థల ప్రతినిధులతో పాటు దళిత్ యూకే నెట్వర్క్ డైరెక్టర్ గజాల షేఖ్, అంబేద్కర్ యూకే సంస్థ ప్రతినిధి సుశాంత్ ఇంద్రజిత్ సింగ్, ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టీ. డీ. ఎఫ్ చైర్మన్ కమల్ ఓరుగంటి, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, ఉదయ్ ఆరేటి, కన్జర్వేటివ్ నాయకుడు హరి తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles