జగిత్యాల : కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేస్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. కొండగట్టు ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ఆంజనేయ స్వామి పారాయణానికి మించిన మందు లేదని ఆనాటి నుండి పారాయణం ప్రారంభించామన్నారు. కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో పెద్దహనుమాన్ జయంతి వరకు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని తెలిపారు.
ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టులో అంజన్న స్వామిని దర్శించుకొని, ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. బి.వినోద్ కుమార్ ఎంపీ గా ఉన్నప్పుడు వందల ఎకరాల భూమిని స్వామి వారికి కేటాయించారని చెప్పారు.
ఆంజనేయ స్వామి దయ, కృపా అందరిపై ఉండాలని కవిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యేలు సుంకె రవి శంకర్, డా.సంజయ్ కుమార్ దంపతులు, జడ్పి చైర్ పర్సన్ దావ వసంత, ప్రజాప్రతినిధులు ఉన్నారు.