Monday, May 20, 2024

నాడు జలదృశ్యం.. నేడు ఢిల్లీలో అద్వితీయ దృశ్యం

spot_img

హైదరాబాద్: జలదృశ్యంలో ఒక్కరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై.. దేశ రాజధానిలో సగర్వంగా అడుగుపెట్టిన సందర్భంగా గులాబీ శ్రేణులందరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాదు  యావత్తూ తెలంగాణ ప్రజలకి గర్వకారణం అన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ సారథ్యంలో.. పార్టీ కార్యశ్రేణుల పట్టుదల వలనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకైన బీఆర్ఎస్ జెండా ఇవాళ సమున్నతంగా ఢిల్లీలో రెపరెపలాడిందని కెటిఅర్  గుర్తుచేశారు. ఉద్యమ నాయకుడే..  ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతున్న  వేళ… బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం.. నేడు ఒక చారిత్రక అవసరమన్నారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడుపోసుకుని… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా… ఇప్పుడు దశాబ్దాలపాటు దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టిందన్నారు.  ఉద్యమపాఠాల నుంచి మొదలుకుని.. యావత్ దేశానికి ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సీఎం కేసిఆర్ కే దక్కిందని కేటీఅర్ వెల్లడించారు. ఈ మహాప్రస్థానంలో.. బీఆర్ఎస్ వేసిన ప్రతి అడుగు సంచలనమని.. అధికార పార్టీగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయమని కేటీఆర్ గుర్తుచేశారు.

గోల్డెన్ తెలంగాణ మోడల్ పైనే చర్చ

గోల్ మాల్ గుజరాత్ మోడల్ పనికిరాదని దేశప్రజలు గ్రహించిన నేపథ్యంలో గోల్డెన్ తెలంగాణ మోడల్  పైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయ యవనికపై బీఆర్ఎస్ బలమైన ముద్ర వేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ను అజేయశక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదంతొక్కాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇచ్చిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా మారుమోగుతోందన్నారు. నాడు తెలంగాణ సాధన  కోసం ఏ సంకల్పంతో బయలుదేరామో.. అదే స్ఫూర్తితో దేశం కోసం కదంతొక్కాలని… అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దామని ఈ సందర్భంగా బీఅర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఅర్ పిలుపునిచ్చారు.

Latest News

More Articles