అండర్ 19 వరల్డ్ కప్ భారత జట్టులో తెలంగాణ పోరగాళ్లు.. యంగ్ క్రికెటర్లకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా ప్రతిష్ఠాత్మక అండర్ 19 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం బుధవారం (డిసెంబర్ 14) బీసీసీఐ భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. పంజాబ్ బ్యాటర్ ఉదయ్ సహారన్ అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
ఈ మేజర్ టోర్నీ కోసం టీమిండియాకు ఎంపికైన జట్టులో ఇద్దరు తెలంగాణ యువ క్రికెటర్లు ఉండడం విశేషం. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్లో పుట్టి పెరిగిన ఆరవెల్లి అవనీష్ రావు, అలాగే హైదరాబాద్ మురుగన్ అభిషేక్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
దీంతో ఈ యంగ్ క్రికెటర్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా యువ ఆటగాళ్లకు అభినందనలు, భవిష్యత్లో వీరిద్దరూ అత్యున్నత స్థానాలను అధిరోహించాలంటూ ఆకాంక్షించారు. ‘దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, అలాగే ముక్కోణపు సిరీస్లకు ఎంపికైనందుకు ఆరవెల్లి అవనీష్ రావు(వికెట్ కీపర్/ బ్యాటర్)కు హృదయపూర్వక అభినందనలు. ఈ యువ క్రికెటర్ మన రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోతగల్ పోరగాడు’ అని అని తనదైన స్టైల్లో విష్ చేశారు కేటీఆర్.