ప్రజల్లో కేసీఆర్పై అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 2014 ఎన్నికల్లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు దీవించారని గుర్తు చేశారు.
ఈసారి 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది చిన్న సంఖ్య ఏమీ కాదని కేటీఆర్ అన్నారు. మూడింట ఒక వంతు సీట్లు గెలిచామని చెప్పారు. జుక్కల్లో షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని, కేవలం 11 వందల ఓట్లతో ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్లో గెలిచారన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయన్నారు. దళిత బంధు పథకాన్ని నిజాం సాగర్ మండలం మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు బీఆర్ఎస్కు ఓట్లు వేయలేదని చెప్పారు.
ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్య పడేలా సమాజం తయారైందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘బంధు’ పథకాల ప్రభావం బీఆర్ఎస్పై పడిందని చెప్పారు. గతంలో పాలకులు తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు కేటీఆర్.