మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాలికి మైనర్ శస్త్ర చికిత్స జరిగింది. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రాత్రి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి ఉన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో హాట్ హాట్ చర్చ
అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆలయాలు, మసీదులో, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిగేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వికలాంగులకు వీల్చైర్స్ పంపిణీ, ఆటో డ్రైవర్లకు ఇన్సురెన్స్ పేపర్లు పంపిణీ, పేషేంట్స్ పండ్ల పంపిణీ తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, ఉద్యమ నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అంతేకాదు.. 70వ జన్మదినం సందర్భంగా 70 కిలోల భారీ కేక్ను కట్ చేయనున్నట్లు చెప్పారు తలసాని.