రాబోయే రోజుల్లో పంటలు ఎండిపోకూడదంటే.. కామధేనువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లలను సరి చేయకుండా.. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం బ్యారేజ్ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వాస్తవాలు తెలియజేసేందుకు చలో మేడిగడ్డ పర్యటనకు వచ్చామని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ ను సందర్శించాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తామని తెలిపారు. ఇది మొదటి అడుగు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ అన్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మూడు బ్యారేజ్ లు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల టన్నెల్స్, 1500 కిలోమీటర్ల కెనాల్స్ కలిపితే కాళేశ్వరం అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు రైతాంగానికి వాస్తవాలు చెప్పాల్సిన అసవరం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. 1.6 కి.మీ. మేడిగడ్డ బ్యారేజ్ లలో 83 పిల్లర్లు ఉన్నాయి. అందులో మూడు పిల్లర్లు దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరం వృథా అయిందని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతాం. మేడిగడ్డ బ్యారేజ్ కు మరమ్మతులు చేసి నీళ్లు విడుదల చేయాలి. బీఆర్ఎస్పై బురద జల్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు కేటీఆర్ .
ఇది కూడా చదవండి: మాపై కోపం ఉంటే తీర్చుకోండి.. రాష్ట్రం, రైతులపై పగ వద్దు