జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ప్రియురాలు చనిపోయిన 8 రోజులకు ప్రియుడు మృతిచెందాడు. వెంకిర్యాల గ్రామానికి చెందిన అరవింద్, కావేరి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దాంతో మనస్థాపం చెందిన కావేరి.. డిసెంబర్ 25న ఆత్మహత్య చేసుకుంది. కావేరి కుటుంబసభ్యులు మృతదేహంతో అరవింద్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అటు కావేరి చనిపోవడం, ఇటు ఇంటిముందు ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చేయడం చూసిన అరవింద్.. డిసెంబర్ 26న పురుగుల మందు తాగాడు. గమనించిన అతని కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అరవింద్.. జనవరి 3న చనిపోయాడు. ఎనిమిది రోజుల వ్యవధిలో ఇద్దరూ చనిపోవడంతో.. రెండు కుటుంబాలతో పాటు, గ్రామంలోనూ విషాదం నెలకొంది.