హైదరాబాద్: తెలంగాణలో ఏదో చేస్తామంటూ ఊదరగొడుతున్న ఢిల్లీ పార్టీలు ఇక్కడి జనాల్లో చులకనవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 115 నియోజవర్గాల అభ్యర్థులను ప్రకటించి రేసులో దూసుకుపోతున్నది.
చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఖమ్మంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా సభలు నిర్వహించినా.. ఎక్కడా పోటీచేసే అభ్యర్థుల ఊసు కానీ, చేరికల జాడను కానీ వారు చెప్పలేదు. ఈ రెండు సభల్లోనూ ఆ పార్టీల అగ్రనేతలు అరిగిపోయిన రికార్డుల్లా ఉత్త మాటలకే పరిమితమయ్యారు.
పైగా తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్పై అసత్యపు ఆరోపణలు చేసి తమస్థాయిని దిగజార్చుకొని జనాల్లో చులకన అయ్యారు. అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే టికెట్ దక్కని అసమ్మతులు తమ పార్టీలో చేరేందుకు క్యూ కడుతారని కాంగ్రెస్, బీజేపీ ఆశలు పెట్టుకొన్నాయి. కానీ అవన్నీ అడియాసలు కావడంతో ఆ పార్టీల నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు.
టికెట్ ఆశించే ఏ ఒక్క అసమ్మతి నాయకుడు కూడా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ గడప తొక్కలేదు. దీంతో కాంగ్రెస్ ఖర్గే, బీజేపీ అమిత్ షా బిక్కమొఖాలు వేసుకొని తిరుగుప్రయాణం అయ్యారు. బీఆర్ఎస్ను గద్దె దింపుతామన్న మాటే తప్ప తాము ఏ విధంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాగలమో ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారు.