చాలా పెళ్లిల్లు అంగరంగవైభవంగా చేస్తుంటారు. అతిథులకు మర్యాదలో ఏ మాత్రం లోటు రాకుండా చూస్తుంటారు. ఎక్కడైనా లోటు వచ్చిందో.. పెళ్లిల్లు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా చిన్న లోటు పెళ్లి ఆగిపోవడానికి కారణం అయింది. మూలుగ బొక్క కోసం పెళ్లి రద్దయిన విచిత్ర ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. నవంబరు మొదటి వారంలో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ నిశ్చితార్థ వేడుకలో భాగంగా అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారి పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. తర్వాత ఇరువర్గాలు శాంతించినా పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయింది.