తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలి కన్నీరు కారుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలపై ఒలకబోస్తున్న ప్రియాంక గాంధీ తీరు నవ్వు తెప్పిస్తుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంగళవారం తొర్రూరు మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాల గురించి కాంగ్రెస్ మాట్లాడటం అంటే హత్య చేసి, శవంపై దండలు వేసి కన్నీరు కారుస్తున్న చందంగా ఉందని విమర్శించారు. 25 ఏండ్ల కిందనే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే, ఆత్మ బలిదానాలు జరిగేవా? అమర వీరుల కుటుంబాలు ఉండేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్చేసిన మోసంతోనే అనేక మంది బలిదానాలు చేసుకున్నారని ఆరోపించారు.