తెలంగాణ ఏర్పడిన తర్వాత కరీంనగర్ నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని తెలిపారు శాఖ మంత్రి గంగుల కమలాకర్. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇవాళ (బుధవారం) కరీంనగర్ పాతబజార్ శివాలయం-కాపువాడ లింకు రోడ్డు పనులను మేయర్ సునీల్ రావు తో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగల.. దశాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధి మరింత శరవేగంగా కొనసాగిస్తాం. ఇప్పటికే రూ.2,500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మాయమాటలతో మోసగించే వారిని నమ్మవద్దన్నారు.
ఓట్ల కోసం డ్రామాలడే వాళ్లకు అవకాశం ఇస్తే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు మంత్రి గంగుల. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా నగరాన్ని రాష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలో మట్టి రోడ్లకు మహర్దశ వచ్చిందన్నారు మంత్రి.