కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు లేకపోతే జీవం లేదు, నీళ్లు లేకపోతే బతుకుదెరువు లేదన్నారు. అలాంటి జీవాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలోని టీటీసీ భవన్లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీ హయాంలో దొంగరాత్రి కరెంటు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిన మోటర్లు అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు తిట్ల పోటీలో పోటీ పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ వడ్లు పుట్లు పుట్లుగా పండించేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు. మన వడ్లు కొనడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అడుగుతున్నాయని చెప్పారు. తెలంగాణను దేశ ధాన్యాగారంగా సీఎం కేసీఆర్ మార్చారని తెలిపారు.