Tuesday, May 21, 2024

తెలంగాణ జీరో సెస్ టేకింగ్ స్టేట్ ఇన్ ఇండియా

spot_img

హైదరాబాద్: గోల్కొండ రిసార్ట్ లో వాణిజ్య శాఖ ఆదాయ వనరులు పెంపుదలపై నిర్వహించిన మేథోమధన సదస్సుకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కమర్షియల్ టాక్స్ కమిషనర్ నీతు ప్రసాద్, రాష్ట్ర కమర్షియల్ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది 2022-23లో 72,564 కోట్ల పన్నులను వసూలు చేసి లక్ష్యాన్ని సాధించి చరిత్రను సృష్టించిందన్నారు. దీని కొరకు కృషిచేసిన వాణిజ్య పన్నుల శాఖలోని ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వీటి కొరకు ఎంతో ధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది. రాష్ట్రానికి ఆదాయాన్ని సమీకరించడంలో వాణిజ్య పన్నుల శాఖదే పెద్దచేయి. ఇది దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం మీ శాఖకు 85,413 కోట్లను బడ్జెట్ లక్ష్యంగా ఇవ్వబడిందన్నారు. సమీకరించే ప్రతి రూపాయి సమాజంలోని అట్టడుగు జనాల కొరకు వినియోగించబడుతుంది అన్నది మాత్రం ఎన్నటికీ మరువకూడదని సూచించారు.

తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేది గుర్తు పెట్టుకోవాలి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇంకా పెంచి దేశంలోనే తెలంగాణను అభివృద్ధికి సూచికగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. మిషన్ భగీరథ పథకం కావచ్చు.. రైతుబంధు కావచ్చు.. మూగ జీవులకు అంబులెన్స్ కావచ్చు .. జిల్లాకు మెడికల్ కాలేజ్ కావచ్చు ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి మోడలుగా నిలుస్తున్నాయన్నారు.

మన రాష్ట్ర పర్ఫామెన్స్ అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందని జీఎస్టీ సమావేశాల్లో గమనించినట్లు పేర్కొన్నారు. గడిచిన 8 సంవత్సరాలలో స్ట్రీట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ రేట్ లో భారతదేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. పారదర్శక పరిపాలన అందించినప్పుడే ఇలాంటి రెవెన్యూ గ్రోత్ రేట్ సాధ్యమవుతుంది . సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెస్ తీసుకోని ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ జీరో సెస్ టేకింగ్ స్టేట్ ఇన్ ఇండియా అని తెలిపారు.

రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం తోడుగా ఉండి మీకు సహకరిస్తుంది. రాష్ట్రం సాధించిన ఆర్థికవృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం. 2014 సంవత్సరంలో 1,12,162 రూపాయలు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, 2022 లో 2,65,942 రూపాయలు అని వివరించారు.

దక్షిణ భారతదేశంలో వ్యవసాయ వృద్ధిరేట్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయినంక వీరికి పరిపాలన చాతనవుతుందా అన్న వాళ్లు ఈ రోజు అబ్బురపడేలా తెలంగాణ అభివృద్ధి లో ముందుకు సాగుతుందన్నారు.

గత పాలకులు అభివృద్ధి అంటే ఐటీ లేదా సంక్షేమం లేదా వ్యవసాయం అంటూ కేవలం ఒక రంగాన్ని పట్టుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు మన  ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని ఐటీతో పాటు అన్ని రంగాల్ని కలిపి తెలంగాణను  అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచారని పేర్కొన్నారు.

దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా మంచి ప్రాక్టీస్ ఉంటే దాన్ని మనం అనుసరించవచ్చు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే ఏ విషయమైనా మనం నేర్చుకొని మన రాష్ట్రానికి ఉపయోగపడేలా కృషి చేయాలని సూచించారు. ఈ సదస్సులో పాల్గొన్నటువంటి 158 మంది ఆఫీసర్లు 6 టీములుగా ఏర్పడి, విభిన్న రంగాలలో పన్ను ఏ విధంగా ఎగవేతకు గురవుతుందో వెలికి తీయడానికి తమ అనుభవాన్ని ఆలోచనలన్నీ చట్టంలో ఉన్న సూక్ష్మాలని రంగరించి ఒక ప్రణాళికను తయారుచేసి ఇవ్వబోతున్నారని తనకు తెలిపారని, ఈ ప్రయోగం వలన రాష్ట్రానికి ఎంతో అవసరమైనటువంటి ఆదాయాన్ని సమీకరిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Latest News

More Articles