సూర్యాపేట: కాంగ్రెస్ పాలనలో కరెంటు వస్తేనే వార్త అయితే.. బిఆర్ఎస్ పాలనలో కరెంటు పోతేనే వార్త అని రాష్ట్ర మంత్రి , సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మన తలరాతను నిర్ణయించే ఓటు విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.
2014 ముందు అగమ్య గోచరంగా ఉన్న సూర్యాపేటలో ఎవరికి వేసిన ఓటుతో ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. 2014 కు ముందు దామోదర్ రెడ్డి పాలనలో కరెంట్ ఉంటే వార్త అయితే నేడు బిఆర్ఎస్ పాలన లో కరెంటు పోతేనే వార్త అన్నారు. 30 ఏళ్ల దామోదర్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్న మంత్రి,2014 ,18 లలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చా అన్నారు.
తాము ఏమి చేసామో, మళ్లీ ఏమీ చేస్తామో చెప్పే దమ్ము దామోదర్ రెడ్డికి ఉందా? అంటూ ప్రశ్నించారు? గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినన్న మంత్రి.. సూర్యాపేటను దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేస్తానని దండు మైసమ్మ సాక్షిగా శపథం చేశారు. కాంగ్రెస్ అంటే గోస, బీఆర్ఎస్ అంటే భరోసా అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే రౌడీ రాజ్యం వస్తుందని అన్నారు.