Friday, May 17, 2024

జీవో నెంబర్ 58, 59 పట్టాల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలి

spot_img

వరంగల్: వరంగల్ నగరంలో  పర్యటించిన పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్,  కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు సంస్థల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో వరంగల్ నగర అభివృద్ధిపైన కొన్ని సూచనలు, ఆదేశాలను జారీ చేశారు.

వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని మంత్రి కేటీఆర్ కు తెలియచేసిన అధికారులు, ఆయా ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులను రానున్న నెలలో ప్రారంభిస్తామన్నారు. వరంగల్ ఇన్నర్ రోడ్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులకు కేటీఆర్ సూచించారు. దీంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ బస్ స్టాండ్ పనులను సైతం నెలలోగా మొదలుపెట్టాలన్న కేటీఆర్, మొత్తం బస్టాండ్ నిర్మాణాన్ని ఒక సంవత్సరంలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలతో బస్టాండ్ కార్యకలాపాలు వెంటనే  ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వరంగల్ లో మిషన్ భగీరథ కింద తాగునీటి సరఫరా పెరిగిందని, అయితే నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులున్న 51 కాలనీల్లోని  50వేల ఇండ్లకు మిషన్ భగీరథ రెండవ దశతో నీటిని సరాఫరా చేసే ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు పనులు దాదాపుగా పూర్తయ్యాయని, రోజుల వ్యవధిలోనే మిగతావాటిని పూర్తిచేస్తామని కేటీఆర్ తో అధికారులు చెప్పారు.

అవసరమైన కనీస వసతులతో 42 విలీన గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ  ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నిర్మించినట్టుగానే వరంగల్ సిటీలోనూ భారీ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లను ఆరేడుచోట్ల కట్టాలన్నారు కేటీఆర్. పేద, మధ్యతరగతి ప్రజలు ఎలాంటి ఖర్చులేకుండా అన్ని రకాల శుభకార్యాలను నిర్వహించుకునేందుకు  ఈ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు ఉపయోగపడతామన్నారు. వీటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు కేటీఆర్. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. మామునూరు విమానాశ్రయానికి సంబంధించి, అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలని సూచించారు.

రాబోయే వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్సూన్ (MONSOON) ప్రణాళికను పకడ్బందీగా రూపొందించుకొని, అందుకు అవసరమైన కార్యక్రమాలను జూన్ నెల ప్రారంభం నాటికే పూర్తి చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముంపు సమస్యను పరిష్కరించడం లేదంటే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నాలాల పటిష్టత కోసం మొదలుపెట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న నాలాల పటిష్టత పై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలన్నారు. వర్షాలకు వరద నీరుతో నిండిపోయే రోడ్లను గుర్తించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన జీవో 58, 59 పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కేటీఆర్ అధికారులను కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, సత్యనారాయణ- సిడిఎంఏ, హనుమకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఇతర జిల్లా విభాగాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News

More Articles