Saturday, May 4, 2024

హైదరాబాద్ అభివృద్ధి ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది

spot_img

హైదరాబాదులో పెరుగుతున్న భూముల ధరలు, ఇక్కడ ఉన్న గ్రోతు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్, హైటెక్స్‎లో ఏర్పాటుచేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్ పో 2023ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ నగరమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సమిష్టిగా, బ్యాలెన్స్‎గా అర్బన్ డెవలప్మెంట్ మరియు రూరల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. సాగునీరు, తాగునీరు, వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, విద్యుత్ రంగం అన్ని రంగాల మీద ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ముందు చూపుతో దృష్టి సారించింది. తెలంగాణ రాకముందు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉండేది, పవర్ హాలిడేస్‎తో పరిశ్రమలకు సెలవులు కూడా ఇచ్చే వాళ్ళు. జిరాక్స్ సెంటర్ నడవాలన్నా విద్యుత్తు ఉండకపోయేది. కానీ, ఈ రోజు 26 వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్రంలో అందుబాటులో ఉంది. గతంలో తాగునీరుకు హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఇబ్బంది ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శకనికత వల్ల కృష్ణానది నుండి, గోదావరి నుండి వందల కిలోమీటర్లు నీళ్లు తీసుకువచ్చి తాగునీరు అందిస్తున్నాం. ఇటు కాళేశ్వరం, అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 10% తాగు నీటిని అందిస్తున్నాం. హైదరాబాదుకు భవిష్యత్తులో తాగునీటి కొరత ఉండదు.

హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. సినిమా హీరో రజినీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఇది న్యూయార్కా లేక హైదరాబాదా అనే సందేహం వచ్చిందన్నాడు. విశ్వనగరంగా పోటీపడాలంటే మరింత ఇన్‎ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వరకు మెట్రో టెండర్లు కూడా పూర్తి అయ్యాయి, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ చుట్టూ మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైదరాబాద్‎కు ఏ రంగంలో పెట్టుబడులు రావాలన్నా.. ల్యాండ్ అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలి. గతంలో ఏ పండుగొచ్చినా కూడా వారం రోజుల పాటు కర్ఫ్యూ ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు ఆ పరిస్థితి హైదరాబాదు నగరంలో లేదు. హైదరాబాదు నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి హైదరాబాదు నగరం ఎక్స్‎పాండ్ అవుతుంది.

రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‎కే పరిమితం కాలేదు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ పెరిగింది. హైదరాబాదులో పెరుగుతున్న ధరలు, ఇక్కడ ఉన్న గ్రోతు ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది. మెట్రో విస్తరిస్తాం, మూసి ప్రాజెక్టును సుందరీకరణ చేస్తాం. గొప్ప విజనరీ లీడర్ మన కేసీఆర్ ఉన్నారు. అందుకే గ్లోబల్ సిటీగా హైదరాబాద్‎ను తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, కొండాపూర్ అని కొంత మంది విమర్శ చేస్తున్నారు. న్యూయార్ లాంటి నగరాల్లో కూడా కొన్ని పాత సిటీస్ ఉన్నాయి. స్కై టవర్స్ కోసం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వం గ్రీన్ బిల్డింగ్స్‎ని ప్రోత్సహిస్తుంది. డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‎గా కూడా నిర్మాణాలు జరగాలి. హైదరాబాద్ పడమర వైపే కాకుండా మిగతావైపుల కూడా బిల్డర్లు అభివృద్ధి చేయాలి. అక్కడ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున వసతులు కల్పించింది. సౌత్ మరియు ఈస్ట్ హైదరాబాద్ మీద బిల్డర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే హైదరాబాద్ నుండి 40 నుంచి 50% GSDP గ్రోత్ రేట్ ఉంది. ప్రభుత్వం తిరిగి మాదే వస్తుంది.. వచ్చే ఎడాది కూడా టైమ్స్ వాళ్ళు ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయండి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles