ఏపీలో బీఆర్ఎస్ను గెలిపిస్తే.. కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేస్తామిన తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న మంత్రికి వేదపండితులు ఆశీర్వాదం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘దేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం మొదలైంది. ఇప్పటికే దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ప్రజలంతా ఆలోచనలో పడ్డారు. సీఎం కేసీఆర్ కొద్ది మందితో టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై సంవత్సరాల్లో చరిత్ర సృష్టించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.
తెలంగాణా రాష్ట్ర ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పధకాలు.. దేశ మొత్తం అమలు చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రాల్లో మంచి ఆధరణ వస్తొంది. త్వరలో వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలు పెట్టేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఏపీ, తెలంగాణాలు రెండు ఒకేసారి విడిపోయాయి. తెలంగాణా రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఏపీ కూడా తెలంగాణలాగా అభివృద్ధి చేందాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీకి చెందిన ముప్పై శాతం ప్రజలు హైదరాబాదులోనే ఉన్నారు. తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలు అంతా తెలంగాణ అభివృద్ధిని చూస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని కేంద్రం హామీ ఇచ్చి తొమ్మిది ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకూ పోలవరం పూర్తి కాలేదు. విభజనలో రకరకాల హామీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. స్పెషల్ స్టేటస్ ఇస్తాం అన్న కేంద్రం ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఏపిలోని వివిధ రకాల సంఘాల నాయకులు అంతా ఆలోచనలో పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఏపిలో వస్తే.. విభజనలో ఇచ్చిన హామీలు కేసీఆర్ రాకతోనే పూర్తి అవుతాయి. కేవలం మూడేళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేశారు. కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వక పోయినా.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే ధమ్ము, ధైర్యం కేవలం కేసీఆర్కే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రాలో 175 సీట్లకు 175 సీట్లలో అభ్యర్ధులను నిలబెడుతాం. ప్రజల నుంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నాం. ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టి రావాలని కోరుకున్నా, అందుకే కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నా’ అని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.