తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ ఫంక్షన్ హాలులో బంజారా సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములుగును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని.. భవిష్యత్లో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్, సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు ఇవ్వడంతో పాటు తెల్లరేషన్ కార్డు దారులకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు మంత్రి సత్యవతి.
కాంగ్రెస్ పాలనలో బంజారాలకు చేసిందేమీలేదని, మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటూ విమర్శించారు మంత్రి సత్యవతి రాథోడ్. కాంగ్రెస్ వస్తే కర్నాటక తరహాలోనే కరెంటు కష్టాలు తెలంగాణలో మళ్లీ మొదలవుతాయన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని.. అక్కడ ఐదుగంటల కరెంటు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో 3గంటల పార్టీ కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అంటున్నాడన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ 24 గంటల పాటు రైతాంగానికి ఉచిత విద్యుత్ను అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. రైతులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఆ పార్టీకి మాత్రం రైతులపై ఎలాంటి మమకారం, చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో తండాలను జీపీలుగా చేసిన నేత సీఎం కేసీఆర్ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో లంబాడా జాతికి ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సత్యవతి రాథోడ్.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి సీఎంలు దొరికారు కానీ ఓటర్లు లేరు