తుక్కుగూడలో కాంగ్రెస్ విజయ భేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. ‘ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీవి బూటకపు హామీలు. కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ఈ రాష్ట్ర ప్రజల నమ్మరు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రైతు రుణమాఫీ అని ప్రకటించినా, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటనకు పట్టం కట్టారు.
ఇక కాంగ్రెస్ చరిత్రలో మొత్తం చేయని హామీలే ప్రకటిస్తారు. కాంగ్రెస్ చెయ్యి గుర్తు పార్టీ అంటే ఏమి చెయ్యని గుర్తు అని ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 4వేల పెన్షన్ ఇస్తున్నారా. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా పథకాలు ఏ ఒక్కటైన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా. కాంగ్రెస్ ది మాటల ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ది చేతల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా అదే ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు, తప్పుడు ప్రకటనలను తెలంగాణ మహిళలు విశ్వసించరు’ అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.