మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన దిగ్విజయంగా కొనసాగుతుంది. రెండవరోజు కూడా అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి తెలంగాణలో వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలని.. తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం అని పేర్కొన్నారు. అమెరికాలో మీడియాతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా
స్వీకరించే పరిస్థితులు రావాలి. ఉన్నత చదువులు చదివి అమెరికాలో అత్యంత అధునాతన వేల ఎకరాల లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రం నిర్వహిస్తున్న ప్రస్తుత యజమానులు అభినందనీయులు.
అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నం. ఇక్కడ భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమయింది. ఇక్కడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా మనదేశానికి భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి భారీ యంత్రాల వినియోగం వ్యక్తిగత స్థాయిలో సాధ్యపడదు .. అందుకే రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితం అయ్యి యాంత్రీకరణ ఫలాలు అందుకోవాలి. సహకార వ్యవస్థ బలోపేతం అయితేనే భవిష్యత్ లో కార్పొరేట్లకు ధీటుగా నిలబడటం సాధ్యపడుతుంది