మా బలం, బలగం బీఆర్ఎస్ సైన్యమే అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తమ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ బూత్ ఇంచార్జ్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు. క్రమశిక్షణ గల బీఆర్ఎస్ పార్టీ సైనికులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయ్యేలా ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అంటేనే అభివృద్ధికి చిరునామా అని, గత పదేళ్లలో రాష్ట్రంలో, జిల్లాలో, మహబూబ్ నగర్ లో జరిగిన అభివృద్ధినే తమను మరోసారి భారీ విజయం సాధించేలా చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు తెలిసేలా చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. క్షేత్ర స్థాయిలో మిగతా పార్టీలకు కనీసం ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు. అయినప్పటికీ పోలింగ్ వరకు పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. కనీసం ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి నెల, రెండు నెలలు మాత్రమే ఉండి వెళ్లే గెస్ట్ క్యారెక్టర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు మంత్రి.
24 గంటలు, 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు సహా అనేక అంశాల్లో సాయమందిస్తున్నామని తెలిపారు మంత్రి. మనకు ప్రజాబలం బలంగా ఉందని అది త్వరలో జరిగే ఎన్నికల్లో మరింత స్పష్టంగా వెల్లడవుతుందన్నారు. కార్యకర్తలు నవంబర్ 30వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండి ఎన్నికలను విజయవంతం చేయాలని సూచించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఇది కూడా చదవండి: కారు గుర్తుకే ఓటేస్తాం… శ్రీనివాస్ గౌడ్ ను గెలిపిస్తాం