రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రూ. 15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వారం రోజుల్లో ఆలయ కమిటీలు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. బోనాల ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ పరిధిలో లేని ప్రైవేట్ దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. బోనాల నిర్వహణ కోసం ప్రతి ఏటా దేవాదాయ శాఖ పరిధిలోని లేని ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని. బోనాల పండుగకు ముందే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రకటించారని తెలిపారు.
రాష్ట్రంలో గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 22న గోలొండలో బోనాలు ప్రారంభం అవుతుండగా.. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రతి ఏటా తరహాలో ఈ ఏడాది కూడా ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.