ధరణి పథకంపై అనవసరమైన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఓడించి బంగాళాఖాతంలో కలపడం తప్పదని ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1000 పింఛన్ పెంచడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఫిలింనగర్లోని చౌరస్తాలో దివ్యాంగుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. దేశంలో ఎవరూ అమలు చేయలేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. దివ్యాంగుల పరిస్థితులను అర్థం చేసుకొని.. అడగకముందే వేయి రూపాయల పింఛన్ పెంచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో 100 సీట్లు తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలను బంగాళాఖాతంలో కలపక తప్పదని హెచ్చరించారు.