60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదని.. వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాక ముందు ఈ నగరంలో దయనీయ పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించాం. ఈ కాలనీని దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేసుకుంటాం. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తాం. బీఆర్ఎస్ కొత్త మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయి. కేసీఆర్ ఏది చెప్పినా అది చేసి చూపెడతారు. 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక్కటే మైనారిటీ పాఠశాల ఉండేది. ఇప్పుడు జిల్లాలో 23 మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేశాం.
ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్న బియ్యం ఇస్తాం. మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో ఎక్కడ కూడా మత ఘర్షణలు జరగలేవు. రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలో పరిపాలన ఉండనుంది. రానున్న ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యాన్ని చేరువ చేశాం. నిజామాబాద్ ఐటీ హబ్లో 3200 ఉద్యోగాలు కల్పించాం. రానున్న ప్రభుత్వంలో విద్య, వైద్యం మరింత మెరుగు పరుస్తాం. కొత్త బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తాం’ అని కవిత హామీ ఇచ్చారు.
Read Also: ‘ఎట్లుండే తెలంగాణ.. ఎట్లైంది’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్