చనిపోయిన మనిషిని అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే.. కుదుపులకు ఒక్కసారిగా లేచికూర్చున్న ఘటన హర్యానాలో వెలుగుచూసింది. రోడ్డుపై గొయ్యే తమ తాత ప్రాణాలను తిరిగి తెచ్చిందని అంబులెన్స్లో మృతదేహంతో పాటు వస్తున్న అతని మనవడు సంబరపడుతూ తెలిపాడు. హర్యానాలోని కర్నల్లో నివసించే 80 ఏండ్ల దర్శన్ సింగ్కు అస్వస్థతగా ఉండటంతో పాటియాలలోని దవాఖానలో చేర్చారు. నాలుగురోజులు వెంటిలేటర్పై చికిత్స అందించిన తర్వాత గురువారం అతను మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. దాంతో అతని మృతదేహాన్ని అంబులెన్స్లో వేసుకుని ఆయన మనవడు బల్వన్ స్వగ్రామానికి బయలుదేరాడు. గ్రామంలోని కుటుంబసభ్యులు దర్శన్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. అంబులెన్స్ వస్తూ వస్తూ.. దారిలో ఒక పెద్ద గోతిలో పడి కుదుపునకు గురైంది. ఆ సమయంలో దర్శన్సింగ్లో కదలిక కన్పించింది. గమనించిన మనవడు వెంటనే అంబులెన్స్ ను దగ్గరలోని ఆస్పతికి పోనిచ్చాడు. అక్కడ పరిశీలించిన వైద్యులు.. దర్శన్ సింగ్ బతికే ఉన్నాడని తేల్చారు. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్లి చికిత్స మొదలుపెట్టారు. ప్రస్తుతం తమ తాత కోలుకుంటున్నాడని మనవడు బల్వన్ తెలిపాడు.