పేటీఎంలో మరోసారి ఉద్యోగుల తొలగింపులు జరగనున్నాయి. వివిధ విభాగాల ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు తెలుస్తోంది. పేటీఎం చెల్లింపు బ్యాంకులు తమ విధివిధానాలను సరిగ్గా నిర్వర్తించడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిశితంగా గమనిస్తున్న క్రమంలో తాజా లేఆఫ్స్ జరుగుతున్నాయి.
పేటీఎం ఉద్యోగుల్లో ఎంతమందిని తప్పిస్తున్నారు, ఏయే ఉద్యోగులను కంపెనీని వీడి వెళ్లాలని కోరారనే వివరాలు తెలియకున్నా.. వివిధ టీమ్స్ లో 20 శాతం వరకూ ఉద్యోగుల్లో కోత విధించాలని కంపెనీ ప్రకటించినట్లు సమాచారం. ఈ మొత్తం పునర్వ్యవస్ధీకరణ ప్రక్రియ రెండు వారాల కిందట ప్రారంభమైంది. దీంతో పలువురు ఉద్యోగులు తమ కొలువుల భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారు.
అయితే లేఆఫ్స్ వార్తలను తోసిపుచ్చుతూ తాము కేవలం ఎప్పటిలాగే ఉద్యోగుల సామర్ధ్యాలను సమీక్షిస్తున్నామని పేటీఎం ప్రతినిధి చెప్పారు. ఈ సామర్ధ్య సమీక్షలకు అనుగుణంగా ఆయా ఉద్యోగుల బాధ్యతలు మారవచ్చని అన్నారు. తాము పనులను మరింత దీటుగా చక్కదిద్దేందుకు ఏఐ టెక్నాలజీ వాడుతున్న తీరును వివరిస్తూ దీని ఫలితంగా కొన్ని ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు.
ఇది కూడా చదవండి:తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు