నల్గొండ జిల్లా మర్రిగూడెంలో చైన్ స్నాచింగ్కు పాల్పడిన జంట లవర్స్ కాదని, వారిద్దరూ భార్యాభర్తలని పోలీసులు తేల్చారు. వారిద్దరినీ వెంకటేష్, అతని భార్యగా గుర్తించారు. వీరిద్దరూ శుక్రవారం మర్రిగూడెంలో సునీత అనే మహిళకు స్కూటీపై లిఫ్ట్ ఇచ్చి, కొద్ది దూరం తీసుకెళ్లారు. అనంతరం ఆమె దిగగానే, ఆమె మెడలో ఉన్న ఏడు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారు. బాధితురాలి అరుపులతో స్థానికులు బైకులతో వెంబడించినా.. వారిద్దరూ స్కూటీ మీద అతివేగంగా అక్కడి నుంచి పారిపోయారు.
Read Also: పతంగి ఎగిరేస్తుండగా కరెంట్ షాక్తో బాలుడు మృతి
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితులు హైదరాబాద్కు పారిపోయినట్లు గుర్తించారు. నల్గొండ పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ సంతోష్ నగర్ వద్ద స్కూటీపై పారిపోతున్న జంటను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యసనాలకు అలవాటై, చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.