వేరువేరు దేశాలలో ఉంటున్న వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుందామనుకుంటే.. వీసా ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత కరోనా అడ్డమొచ్చింది. 2018లో మొదలైన వారి ప్రేమ.. పెళ్లి పీటలెక్కడానికి ఐదేండ్ల గ్యాప్ వచ్చింది. తాజాగా అమ్మాయికి వీసా లభించడంతో.. ఆ ప్రేమికులు త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు.
Read Also: ‘మహిళలకు ఉచిత ప్రయాణం’పై టీఎస్ఆర్టీసీ అధికారుల కసరత్తు
కోల్కతాకు చెందిన సమీర్ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు. అయిదేళ్ల కిందట భారత్కు వచ్చినప్పుడు తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్ ఫొటో చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. పెద్దలు అంగీకరించినా వీరి పెళ్లికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. భారత్కు వచ్చేందుకు రెండుసార్లు జావెరియా ప్రయత్నించగా ఆమె వీసా తిరస్కరణకు గురైంది. మధ్యలో కొవిడ్ కష్టాలు వచ్చిపడ్డాయి. మొత్తం అయిదేళ్లు అలా గడిచిపోయాయి. ఎట్టకేలకు 45 రోజుల గడువుతో జావెరియాకు ఇపుడు భారత్ వీసా దక్కింది. అతడి కోసం మంగళవారం వాఘా – అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి అడుగుపెట్టిన పాక్ యువతికి బాజా భజంత్రీలతో యువకుడి కుటుంబం ఘనస్వాగతం పలికింది. అమృత్సర్ నుంచి కోల్కతాకు ఈ జంట విమానంలో చేరుకుంది. బ్యాండ్ మేళాతో, డ్యాన్సులతో యువజంటను తమ ఇంటికి తీసుకెళ్లారు. జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు.