ప్రమాదవశాత్తూ సర్వీసు తుపాకీ పేలిన ఘటనలో ఓ రైల్వే కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ రైల్వే స్టేషన్లో ఇవాళ( శనివారం) ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో ప్రయాణికుడు కూడా గాయపడ్డాడు. దినేశ్ చంద్ర (30) అనే కానిస్టేబుల్ ఎస్-2 కోచ్ నుంచి కిందకు దిగుతుండగా తుపాకీ పేలింది. తూటా నేరుగా అతడి ఛాతిలోకి దూసుకుపోవడంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమీపంలోనే పై బెర్తుపై నిద్రిస్తున్న మహ్మద్ డానిష్ అనే ప్రయాణికుడికి కూడా తూటా తగిలి గాయమైంది.
గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కడుపులో గాయమైన ప్రయాణికుడికి చికిత్స అందిస్తున్నారు. మృతుడిది రాజస్థాన్ అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 15వ తేదీన సెలవుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం