తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. అదే సమయంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మాల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, నాగర్కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.