యువతలో భక్తిని పెంచేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రామకోటి మాదిరిగా.. గోవిందనామాలు రాస్తే.. శ్రీవారి వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చిన్నతనం నుంచే యువతలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు 25 ఏళ్లలోపు యువత కోటి గోవింద నామాలు పూర్తి చేస్తే.. వారి కుటుంబానికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. అదేవిధంగా 10,01,116 (పది లక్షల వెయ్యి నూట పదహారు సార్లు) రాస్తే స్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.
మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ అధ్యక్షతన ధర్మకర్తల పాలక మండలి సమావేశం నిర్వహించారు. అధికమాసం రావడంతో ఈ ఏడాది సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15-23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. పెరటాసి మాసం వల్ల రద్దీతో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అదనంగా సిబ్బందిని నియమించామన్నారు. గరుడ సేవలో భక్తులకు సమస్యలు రాకుండా భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నెల 18న ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.