వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ నాదే.. గెలుపు నాదే.. అని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటుచేసి ఆయన మాట్లాడారు. ‘దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్కు శుభాకాంక్షలు. ఎన్నికలు ఆరు నెలల్లో రాబోతున్నాయి, కనుక కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. ప్రసార మాధ్యమాల్లో పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి కార్యకర్తలు గాబరా పడవద్దు. ఎన్ని రూమర్స్ వచ్చినా భయపడను. సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. స్టేషన్ఘన్పూర్ టికెట్ నాదే. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల 30వ తేదీ వరకు ఆత్మీయ సమావేశాలు నిర్వహించమన్నారు. రేపు సెయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండులో జరగబోయే కేటీఆర్ సభకు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి, సభను విజయవంతం చేయాలి’ అని రాజయ్య పిలుపునిచ్చారు.