Sunday, April 28, 2024

దసరా నాటికి వరంగల్ హెల్త్ సిటీ

spot_img

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ పనులు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని చెప్పారు. గ్రేటర్ పరిధితోపాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్ , ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని  ఆదేశించారు. నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2000 పడకల బిల్డింగ్ కు పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇక నుండి నెలవారీగా వీటి పురోగతిపై సమీక్ష చేస్తానని, అధికారులు పురోగతి నివేదిక‌ల‌తో సిద్దంగా ఉండాలన్నారు.

గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ కొత్త బిల్డింగ్, డయాలిసిస్ సేవలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి వెలుగు తదితర అంశాలపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఒక వైపు వైద్యం, మరోవైపు వైద్య విద్యను విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే మెడికల్ హబ్ గా మారుతుందన్నారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని మంత్రి అన్నారు.  ఒక్కొక్కటి 1000 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ తరుపున అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి ఆర్ అండ్ బి అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు.

డ‌యాల‌సిస్ సెంట‌ర్లు  ప్రారంభించాలి

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 3 డయాలిసిస్ కేంద్రాలు మాత్రమే ఉంటే, కిడ్నీ బాధితులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 102 కు పెంచుకున్నట్లు చెప్పారు. ప్రారంభానికి సిద్దంగా ఉన్న డయాలిసిస్ కేంద్రాలు స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభించి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. మూడు క్లస్టర్స్ గా విభజించి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులకు పరిశీలన బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. బాధితులకు నిరంతర సేవలు అందేలా కృషి చేయాలని ఆదేశించారు.

జూన్ ఆఖ‌రుకు 500 బస్తీ దవాఖానలు

హైదరాబాద్ పరిధిలో 350, హైద్రాబాద్ బయట పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు గాను, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయ‌న్నారు.  మ‌రో 57 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. వాటిని వెంటనే ప్రారంభించాలి అధికారుల‌ను ఆదేశించారు. తుది దశలో ఉన్న మిగతా దవాఖానల పనులు వేగవంతం చేయాలన్నారు. జూన్ నెలాఖరు వరకు 500 బస్తీ దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సౌకర్యార్థం ఆదివారం కూడా సేవలు అందిస్తున్నామని, అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు సేవలు అందించాలని చెప్పారు.

డాక్టర్ నెంబర్ బోర్డుపై ప్రదర్శించాలి

ఈ నెలాఖరు వరకు 3206 పల్లె దవాఖనలు పూర్తి స్థాయిలో పని చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరం అయిన 321 ఖాళీలు నింపాలని ఆదేశించారు. 9 నుండి 4 గంటల వరకు పని చేయాలని, పల్లె దవాఖాన టైమింగ్ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్ ఫొనో నెంబర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా బోర్డుపై ఏర్పాటు చేయాలన్నారు. అందిస్తున్న సేవలు, చేస్తున్న పరీక్షలు, వెల్ నెస్ యాక్టివిటీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి అన్నారు. జిల్లా వైద్యాధికారులు పనితీరు పై సమీక్షలు చేయాలని ఆదేశించారు.

కంటి వెలుగు పరీక్షలు అందరికీ చేయాలి

సీఎం కేసీఆర్ గారి ఆలోచనతో ప్రారంబించిన కంటి వెలుగు కార్యక్రమం విజవంతంగా కొనసాగుతున్నదని, 67 పని దినాల్లో 1.31 కోట్ల మందికి కంటి పరీక్షలు పూర్తి చేయడం సంతోషకరమన్నారు. 3006 వార్డుల్లో (87%) , 9556 పంచాయతీల్లో (74.72%)  పూర్తి చేసినట్లు చెప్పారు. 27 శాతం మందికి అద్దాలు అవసరం కాగా, సగటున ఒక్కో బృందం రోజుకు 120 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు చెప్పారు. 19.64 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా, 15.30 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరం అని గుర్తించడం జరిగింది. ఇందులో 12 లక్షల మందికి పంపిణీ చేసినట్లు చెప్పారు.  రాష్ట్ర సగటు (95%) కంటే తక్కువగా అద్దాలు పంపిణీ చేసిన జిల్లాల్లో ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ త్వరగా పూర్తి చేయాలి అన్నారు. హైదరాబాదులో పంపిణీ కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.

ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, డిఎంఈ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస రావు, టీవీవిపి కమిషనర్ అజయ్ కుమార్, టిఎస్ ఎంఎస్ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఈ రాజేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles