రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుట్ర చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తనకు మద్దతిచ్చే విషయమై బీఆర్ఎస్ అధిష్టానంతో మాట్లాడాలని కోమటిరెడ్డి తన వద్దకు రాయబారం పంపారని కౌశిక్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
కోమటిరెడ్డి ఒక మనిషిని నా దగ్గరికి పంపించిండు. 22 మంది ఎమ్మెల్యేలల మద్దతు ఉంది. గవర్నమెంట్ పడగొడుదాం.. నేనే సీఎం అయితా అని, అందుకు బీఆర్ఎస్ మద్దతు కావాలని నా దగ్గరకు పంపించిండు అని తెలిపారు. కానీ నేను కోమటిరెడ్డిని నమ్మలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుకు కూడా చెప్పలేదు. కోమటిరెడ్డి పిచ్చొడు.. నమ్మకం లేదని. రూమ్ లోపల ఒకటి, రూమ్ బయట ఒకటి మాట్లాడుతాడు. మిమ్మల్ని ప్రశ్నించమని ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కోమటిరెడ్డిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు. అసెంబ్లీకి మందుతాగి వస్తడు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదు. హరీశ్రావును విమర్శించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. నోటికొచ్చినట్టు మాట్లాడితే సరికాదు. మీరు ఒక్క మాట అంటే మేం వంద మాటలు అంటాం. అధికారంలో ఉన్నారు కాబట్టి బాధ్యతగా మాట్లాడాలి. మీకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నది కేసీఆర్ సైనికులం తస్మాత్ జాగ్రత్త.. మీ తాట తీస్తాం. మిమ్మల్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు అని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: గూగుల్ లో రాజకీయ ప్రకటనల కోసం బీజేపీ పెట్టిన ఖర్చు రూ.100 కోట్లు