ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ పై విచారణ చేపట్టింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారించింది. హరిరామ జోగయ్య వేసిన పిల్ మీద రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిపింది. పిల్లో సవరణలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. హరి రామ జోగయ్య పిల్కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులైన జగన్, సీబీఐకి హైకోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే సీబీఐ కోర్టులో జగన్ కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య కోర్టును కోరారు.