Saturday, May 18, 2024

5 రోజుల్లో ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. అంత‌లోనే కబలించిన మృత్యువు

spot_img

మంచిర్యాల : ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాల‌ని కసితో ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించి.. తన, ప్రియురాలి కుటుంబ స‌భ్యుల‌ను పెండ్లికి ఒప్పించాడు. అందరూ అంగీక‌రించ‌డంతో ఆ ప్రేమికులిద్ద‌రూ ఆనందంలో తేలిపోయారు. మ‌రో ఐదు రోజుల్లో ఒక్క‌టి కావాల్సిన ఆ జంట‌ను చూసి విధికి కన్నుకుట్టినట్టుంది. పెళ్లి నేప‌థ్యంలో ఉద్యోగానికి సెల‌వు పెట్టి ఇంటికి వస్తున్న అబ్బాయిని హార్వెస్ట‌ర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండ‌లం కొత్త కొమ్ముగూడంలో జరిగింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓగేటి సత్తయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు సాయికుమార్‌(24). నిర్మల్‌ విద్యుత్‌శాఖలో అతను జూనియర్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తమ బంధువుల అమ్మాయిని నాలుగేండ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ నెల 11న వారి పెండ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో సాయి త‌న ఉద్యోగానికి సెల‌వు పెట్టి.. త‌న స్నేహితుడు మ‌హేశ్‌తో క‌లిసి ఈ నెల 4వ తేదీన నిర్మ‌ల్‌కు బైక్‌పై బయ‌ల్దేరాడు.

మేదరిపేట వద్ద లక్సెట్టిపేట వైపు వెళ్తున్న హార్వేస్టర్‌ మరో బైకును తప్పించబోయి సాయి ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు మహేశ్‌కు తీవ్ర గాయాలు కాగా, కరీంనగర్‌ దవాఖానకు తరలించారు. చేతికొచ్చిన కుమారుడు తరలిరాని లోకాలకు వెళ్లాడని తల్లితండ్రులు, జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న ప్రియుడు లేడని ఆ యువతి  గుండెలవిసేలా రోదించడం స్థానికంగా విషాదఛాయలు నింపింది.

Latest News

More Articles