Sunday, May 19, 2024

ఆడుకుంటామని వెళ్లి.. కారులో ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి..!

spot_img

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో విషాదకర ఘటన జరిగింది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు ఇంటి సమీపంలోనే విగత జీవులుగా కనిపించారు. మహా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పచ్‌పోలీ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే తౌఫిఖ్‌ ఫిరోజ్‌ ఖాన్‌(4), అలియా ఫిరోజ్‌ ఖాన్‌(6), అఫ్రిన్‌ ఇర్షద్ ఖాన్(6) శనివారం సాయంత్రం మూడు గంటల నుంచి కనిపించకుండా పోయారు.

రోజు మాదిరిగానే ఆడుకోవడానికి వెళ్లి ఉంటారని తల్లిదండ్రులు భావించారు. అయితే, రాత్రి అవుతున్నా పిల్లల జాడ దొరకలేదు. దీంతో పోలీసుల్ని ఆశ్రయించారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలించారు. చివరకు ఆదివారం రాత్రి 7గంటల సమయంలో వారు ఉండే ఓ కారులో పిల్లలు విగత జీవులుగా ఉన్నట్లు గుర్తించారు. ఆ కారు ఇంటికి 50 మీటర్ల దూరంలోనే తుక్కు దుకాణం ముందు పార్క్ చేసి ఉండటం గమనార్హం.

ఆడుకునే క్రమంలో చిన్నారులు కారులోకి ఎక్కి ఉండొచ్చని, అనంతరం డోర్ లాక్‌ అయి ఊపిరాడక చిన్నారులు మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పోస్టుమార్టం తర్వాత అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు. తౌఫిక్‌, అలియా తోబుట్టువులని, అఫ్రిన్‌ వారి స్నేహితురాలని పోలీసులు తెలిపారు.

Latest News

More Articles