నిర్మల్ జిల్లాలో ఇవాళ(ఆదివారం) ఘోర ప్రమాదం జరిగింది. మామడ మండలంలో టిప్పర్ను లారీ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు చనిపోయారు. మామడ మండల పరిధిలోని బూర్గుపల్లి, మొండిగుట్ట మధ్య రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదే దారిలో వేగంగా దూసుకొచ్చిన లారీ.. అదుపుతప్పి రోడ్డు నిర్మాణంలో ఉన్న టిప్పర్ ను ఢీ కొట్టింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు ఘటనాస్థలంలోనే చనిపోగా.. మరొకరు నిర్మల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతులను కుమ్రం రాజేంద్ర ప్రసాద్(31), పీ లాల్ సింగ్(43), షేక్ ఖాసీం పీరా(43)గా గుర్తించారు. రాజేంద్ర ప్రసాద్, లాల్ సింగ్ నేరడిగొండ మండలానికి చెందిన వారు కాగా, షేక్ ఖాసీ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి అని చెప్పారు. లాల్ సింగ్ టిప్పర్ డ్రైవర్ కాగా, షేక్ ఖాసీం క్లీనర్. రాజేంద్ర ప్రసాద్ కూలీ గా పని చేస్తున్నట్లు తెలిపారు.