మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ కన్నుమూశారు. ఈ ఏడాది మే 31న మావోయిస్టుల గెరిల్లా జోన్లో సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సుదర్శన్ మృతిపై జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా సంస్మరణ సభలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్ణయిచినట్లు ఆయన ప్రెస్నోట్లో పేర్కొన్నారు.
కాగా.. సుదర్శన్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తి. వరంగల్లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన ఆయన.. కమ్యూనిష్టు భావజాలానికి ఆకర్శితులై.. 1980లో ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటున్న సుదర్శన్.. అంచలంచలుగా ఎదిగి సెంట్రల్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు.
టాప్ లీడర్ సుదర్శన్పై హత్య కేసు సహా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మొత్తం 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి. రెండేండ్ల క్రితం ఛత్తీస్గడ్లోని దంతేవాడలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్ హస్తం ఉంది. ఈ దాడిలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఇక గత నెల 28న ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడికి పథక రచన చేసింది కూడా ఆయనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దళంలో పరిచయం అయిన సాధన అనే యువతిని ఆయన వివాహమాడారు. ఆమె కొన్నేండ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్లు సమాచారం.