నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా మూడు కమిషనరేట్ల పరిధిలోని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 అర్థరాత్రి దాటే వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ (ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్పై రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహింస్తామని పోలీసులు ప్రకటించారు.
- ట్రాఫిక్ మళ్లింపు మార్గాలివే
- ఖైరతాబాద్ వీవీ విగ్రహం కూడలి నుంచి ఫ్లైఓవర్ మీదుగా నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు, ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వీవీ విగ్రహం, నిరంకారి, రాజ్భవన్ వైపు ట్రాఫిక్ను అనుమతించరు.
- బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్ను తెలుగుతల్లి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- హిమాయత్నగర్, లిబర్టీ నుంచి వచ్చే వాహనాల రాకపోకలు ఎగువ ట్యాంక్బండ్ వైపు అనుమతించరు. ప్రయాణికులు తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎడమ వైపు వెళ్లాలి.
- ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద సెన్షెషన్ థియేటర్, రాజ్దూత్ లేన్, లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం సచివాలయానికి ఆనుకొని ఉన్న మింట్ కాంపౌండ్ లేన్ మూసేస్తారు.
- సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ కూడలి, లోయర్ ట్యాంక్బండ్, కట్టమైసమ్మ దేవాలయం, లెఫ్ట్ టర్న్ తీసుకొని అశోక్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసేస్తారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్పై వెళ్లేవారు విమానం టికెట్ చూపిస్తే ఆర్జీఐ విమానాశ్రయానికి అనుమతిస్తారు.
- శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్పేట, మైండ్స్పేస్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, రోడ్ నంబర్ 45 ఫ్లైఓవర్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్టీయూ ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, బాలానగర్ ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు.