హైదరాబాద్ లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సులను ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతలో 25 బస్సులను సంస్థ వీసీ అండ్ ఎండీ శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్ గారితో కలిసి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఈ బస్సుల ప్రత్యేకతలను వారు పరిశీలించారు. ఈ నెల 23 నుంచి ఈ బస్సులు నగర ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నాయి.
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ కష్టాల్లో ఉన్నా ప్రజలకు రవాణా కష్టాలు రాకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందిస్తూనే ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను మరింతగా పెంచేలా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ కు ధీటుగా టీఎస్ఆర్టీసీ పనిచేస్తోందన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ గారు బాధ్యతలు స్వీకరించాక గత రెండేళ్ల కాలంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.