Tuesday, May 14, 2024

ట్విట్టర్‌ యూజర్లకు షాక్.. 20 కోట్ల మెయిల్‌ ఐడీలు లీక్‌

spot_img

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ మైక్రోబ్లాగింగ్‌ సంస్థకు చెందిన సుమారు 20 కోట్ల మందికిపైగా యూజర్ల ఈ-మెయిల్ ఐడీలు లీక్‌ అయినట్లు తెలుస్తోంది. హ్యాకర్లు వాటిని ఆన్‌లైన్ హ్యాకింగ్ ఫోరంలో అందుబాటులో ఉంచినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు. దీంతో టార్గెటెడ్ ఫిషింగ్​, డాక్సింగ్ వంటివి జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సంస్థ హుడ్సన్ రాక్ సహవ్యవస్థాపకుడు ఆలోన్ గాల్​ చెప్పారు. తాను చూసిన అతిపెద్ద ‘డేటా లీక్స్​’లో ఇది ఒకటన్నారు. గతేడాది డిసెంబర్‌ 24నే ఆయన ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌ అయినట్లు పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ట్విట్టర్‌ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న సంస్థ ఎలా స్పందిస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

కాగా.. హ్యాకింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో పెను సంచనలనంగా మారింది. తొలుత 40 కోట్ల ట్విట్టర్‌ ఖాతాలు హ్యాక్‌ అయినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య 20 కోట్లకు తగ్గింది. ఈ ఖాతాదారుల మెయిల్‌ ఐడీలు, ఫోన్‌ నంబర్లను దొంగిలించినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని అకౌంట్ల వివరాలు చోరీకి గురవడం పెద్ద విషయమేనని సైబర్‌ నిపుణులు అంటున్నారు. ఖాతాదారులు వారి జాగ్రత్తలో వారు ఉండాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.

Latest News

More Articles