హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రస్తుతం నిర్మిస్తున్న 5 రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. ఇందులో ఉద్దండాపూర్ రిజర్వాయర్(16.3 టీఎంసీలు) కీలకం. ఈ రిజర్వాయర్ కిందే ప్రాజెక్టు మొత్తం ఆయకట్టులో దాదాపు 75 శాతం(9 లక్షల ఎకరాలు) ఉంది.
కేపీ లక్ష్మీదేవిపల్లి (2.5 టీఎంసీలు) మినహా మిగిలిన అంజనగిరి (నార్లాపూర్) 8.51 టీఎంసీలు, వీరాంజనేయ (ఏదుల) 6.55 టీఎంసీలు, వెంకటాద్రి (వట్టెం) 16.74 టీఎంసీలు, కురుమూర్తిరాయ (కరివెన) 17.34 టీంఎసీలు, ఉద్దండాపూర్ 16.03 టీఎంసీలు 5 రిజర్వాయర్ల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఎడమ ప్రధాన కాలువ (120 కిలోమీటర్లు) ద్వారా వికారాబాద్ జిల్లాలో దాదాపు 2.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. హన్వాడ వరకు ఏర్పాటుచేసే మరోకాలువ(20 కిలోమీటర్లు) కింద మహబూబ్నగర్ జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఈ రిజర్వాయర్ దక్షిణ ప్రధాన కాలువ ద్వారా 30 వేల ఎకరాలకు, ఫస్ట్ రైట్ కెనాల్ ద్వారా 9 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, 70 మండలాల పరిధిలోని 1,226 గ్రామాలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) తెలంగాణ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.